తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత(Heatwave Warning) మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడుతుందని ఆశించిన ప్రజలకు, తాజా అంచనాలు షాక్ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఈ వేసవిలో ప్రారంభం నుంచే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించినప్పటికీ, ఇకపై పరిస్థితి పూర్తిగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. వడగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తెలంగాణలో ఉత్తర జిల్లాలు అయిన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలపైగా చేరే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అనేక జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. మొత్తం 21 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అదే సమయంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇవి ఎండల తీవ్రతను తగ్గించే స్థాయిలో ఉండకపోవచ్చని పేర్కొంది.
ALSO READ:India-Sweden| ప్రధాని మోడీ స్వీడన్ పర్యటన విజయవంతం.. కుదిరిన కీలక ఒప్పందాలు








