Telangana Heatwave: తెలంగాణాలో భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు, రాష్ట్రం ఎండలతో అగ్ని గుండంలా మారింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండిపోతున్న ఎండల కారణంగా ఉదయం నుంచే ప్రజలు బయటకి రావడానికే భయపడుతున్నారు. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా గురువారం ఒక్కరోజే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 244 మండలాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
20 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాల నుంచి పొడిగాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో గాలిలో తేమ తగ్గి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలి వేగం ఎక్కువగా ఉండటంతో వడగాలుల ప్రభావం మరింత తీవ్రంగా మారుతోందని హెచ్చరించింది.
ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం, శనివారం వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మధ్యాహ్నం సమయంలో అనవసర ప్రయాణాలు చేయవద్దని, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు సహాయం అందించాలని సూచించారు.








