Telangana Ration Card: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ నెలలోనే కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ సరుకుల అందుబాటు మరింత సులభం కానుంది.
ఇక ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు మరో పెద్ద ఊరట కల్పించనున్నారు. ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందుతుండగా, మూడు నెలల కోటాను కలిపి ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అందించనున్నారు. దీంతో ప్రజలు తరచుగా రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, ఎండల సమయంలో ఇబ్బందులు కూడా తగ్గనున్నాయి.
కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా బియ్యం పంపిణీ ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి 72 కిలోలు, ఐదుగురు సభ్యుల కుటుంబానికి 90 కిలోలు అందుతాయి. అంత్యోదయ కార్డు కలిగిన వారికి నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలలకు 105 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. పోర్టబిలిటీ సదుపాయం ఉండటంతో లబ్దిదారులు తమకు సమీపంలోని ఏ రేషన్ షాపులోనైనా సరుకులు పొందవచ్చు.
అయితే, ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలంటే బయోమెట్రిక్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ మార్పులు చేయాల్సి ఉంది. మూడు నెలల వేలిముద్ర నమోదు ఒకేసారి జరిగేలా సాంకేతిక అప్డేట్లు చేపడుతున్నారు.
మరోవైపు చిన్న గదుల్లో నడుస్తున్న రేషన్ దుకాణాల్లో పెద్ద మొత్తంలో బియ్యం నిల్వ చేయడానికి స్థలం కొరత సవాలుగా మారింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా సరఫరా చేసే ప్రణాళికలను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేస్తోంది.








