Uttam Kumar Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు అందుతున్న మద్దతు ధరపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చివరి గింజ వరకు మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో వరి పంట ఉత్పత్తి భారీగా పెరిగిందని ఆయన తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. వరి ఉత్పత్తి, కొనుగోళ్లలో కూడా తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించడానికే పరిమితమవుతోందని, రాష్ట్రాలకు తగిన సహకారం అందించడం లేదని మంత్రి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.16,470 కోట్లు అదనంగా ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.








