Pemmasani: ఆంధ్రప్రదేశ్ వేగంగా పురోగమించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యవసరమని రాష్ట్ర అభివృద్ధి నమూనాను విశ్వసించే నాయకుడిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలో జరిగిన టీడీపీ మహానాడులో “రాష్ట్రానికి కేంద్ర సహాయం” అనే తీర్మానంపై ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15,000 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, గోదావరి నీళ్లు సముద్రంలో వృథా కాకుండా రైతుల జీవితాల్లో కలవాలన్నదే లక్ష్యమని చెప్పారు.
2014–19 మధ్య పనులు 70 శాతం పూర్తయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 శాతం మాత్రమే పురోగతి సాధించిందని ఆయన విమర్శించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సాయం అందించిందని తెలిపారు. ఆంధ్రుల సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. గ్రామీణ అభివృద్ధిపై మాట్లాడుతూ, నారా లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో సీసీ రోడ్ల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలు సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం హయాంలో రూ.12,000 కోట్లు చెల్లించి 82 కేంద్ర పథకాలను పునరుద్ధరించామని చెప్పారు. అమృత్ పథకం కింద 2 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. రైల్వే అభివృద్ధిపై మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో రాష్ట్రానికి రూ.20,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. 316 ఆర్వోబీలు, 16 వందే భారత్ రైళ్లు, 73 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
అమరావతిలో రూ.2,500 కోట్ల రైల్వే ప్రాజెక్టు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ.4,000 కోట్లు ఖర్చు చేసి ప్రారంభానికి సిద్ధం చేశామని వివరించారు. అలాగే రాయలసీమలో రూ.40,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గూగుల్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు ఏపీ ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని ఆయన అన్నారు.








