Monsoon Update: అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో భారత్లో వర్షాల సీజన్ ప్రారంభ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ తెలిపింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రుతుపవనాల ప్రభావం ప్రారంభమైంది.
రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.
కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి కొద్దిరోజులు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళలో ప్రవేశించిన తర్వాత రుతుపవనాలు క్రమంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరిస్తాయి.
సాధారణంగా కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన 7 నుంచి 10 రోజుల్లో అవి ఆంధ్రప్రదేశ్కు విస్తరిస్తాయి. ఆ తర్వాత తెలంగాణలోకి చేరి వర్షాలు కురవడం ప్రారంభమవుతుంది. దీంతో రాష్ట్రాల్లో వర్షాకాలం మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది.
గత ఏడాది కూడా రుతుపవనాలు ముందుగానే ప్రవేశించి భారీ వర్షాలు కురిపించాయి. ఈసారి కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగితే ముందస్తు వర్షాలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో రైతులు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు.








