Rajinikanth: సూపర్స్టార్ రజనీకాంత్ తదుపరి ప్రాజెక్ట్పై నెలలుగా కొనసాగుతున్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. తాత్కాలికంగా ‘రజనీ 173’గా పిలిచిన ఈ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటనను చిత్ర బృందం విడుదల చేసింది. మొదట ఈ ప్రాజెక్ట్ను దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నట్లు ప్రకటించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో కొత్త దర్శకుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది. తాజాగా యువ దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సినిమా టైటిల్ను ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’గా ప్రకటిస్తూ, దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. పోస్టర్లో రజనీకాంత్ కనిపించిన మాస్ అవతార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ లుక్ వేగంగా వైరల్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సీనియర్ నటి సిమ్రాన్ నటించనున్నట్లు సమాచారం.
మరో ముఖ్యమైన పాత్రలో రాశి ఖన్నా కనిపించనుంది. సంగీత బాధ్యతలను అనిరుధ్ రవిచందర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ డేట్పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి సీజన్లో విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్లో రిలీజ్ డేట్ను ప్రకటించకపోవడం కొత్త ఊహాగానాలకు దారితీసింది.
ఇదిలా ఉండగా, రజనీకాంత్ నటిస్తున్న మరో భారీ చిత్రం ‘జైలర్ 2’ విడుదల షెడ్యూల్ కూడా దీనిపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకే స్టార్కు చెందిన రెండు భారీ చిత్రాల మధ్య సరైన విరామం ఉండేలా ప్లాన్ చేస్తున్న మేకర్స్, ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’ చిత్రాన్ని 2027 వేసవి సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.








