Rajasthan Dust Storm: రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి భయానక ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. సోమవారం చురు జిల్లాలో గంటకు సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈ ఇసుక తుఫాన్ కారణంగా పట్టపగలే ఆ ప్రాంతం మొత్తం చీకటిమయంగా మారిపోయింది. దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో దృశ్యమానం పూర్తిగా తగ్గిపోయి, రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని జీరో విజిబిలిటీ పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామంతో రహదారి రవాణా తీవ్రంగా ప్రభావితమై, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోనే ఉండిపోయారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ఇసుక తుఫాన్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బికనీర్ ప్రాంతంలో కూడా ఇలాంటి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
ఇక వాతావరణ పరిస్థితులపై జైపూర్ వాతావరణ కేంద్రం (IMD) కీలక వివరాలు వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమతో పాటు పశ్చిమ అవాంతరాల ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రీ-మాన్సూన్ ప్రభావం మరింత పెరుగుతుందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
అజ్మీర్, కోటా, టోంక్, దౌసా, చిత్తోర్గఢ్ వంటి పలు జిల్లాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దుమ్ము తుఫాన్లు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Rajasthan Dust Storm | రాజస్థాన్లో రాకాసి ఇసుక తుఫాన్.. జీరో విజిబిలిటీతో జనజీవనం అస్తవ్యస్తం
-








