Ponnam Prabhakar: ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని రైతులందరికీ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వ్యవసాయ జీవితంలో ఎంతో విశిష్టమైన రోజని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కూరెళ్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వ్యవసాయ పనులకు ప్రతీకాత్మకంగా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా భూమాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మంత్రి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్లో అన్ని పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతుల శ్రమ ఫలించి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. రైతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న పొన్నం ప్రభాకర్, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, సాగునీటి సదుపాయాల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక వసతుల కల్పన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని మంత్రి సూచించారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రకృతి అనుకూల వ్యవసాయ విధానాలను అవలంబించాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
ఈ ఏరువాక పౌర్ణమి ప్రతి రైతు ఇంట సంతోషాన్ని నింపాలని, పంటలకు ఎలాంటి క్రిమికీటకాల బెడద లేకుండా మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించిన మంత్రి, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు.
Ponnam Prabhakar | రైతే దేశానికి వెన్నెముక.. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొన్నం ప్రభాకర్ సందేశం
-








