Eruvaka Punnami: వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏరువాక పున్నమిని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున రైతులు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కొత్త వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఈ శుభదినాన భూమాతకు, పశుసంపదకు పూజలు చేసి ప్రకృతిపట్ల తమ కృతజ్ఞతను రైతులు వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్టులో రైతుల కుటుంబాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించవచ్చని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల కింద పెట్టుబడి సాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను రైతులు ధైర్యంగా ఎదుర్కోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ విజయవంతమైన పంటలు పండించాలని ఆకాంక్షించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీకే ఈ పండుగ అని పేర్కొన్నారు. నేలతల్లికి నమస్కరించి కొత్త సాగుకు శ్రీకారం చుట్టే ఈ సంప్రదాయం తెలుగు సంస్కృతికి గొప్ప గుర్తింపని అన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు పచ్చదనంతో కళకళలాడాలని, ప్రతి రైతు కుటుంబం సిరిసంపదలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Eruvaka Punnami | రైతన్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. ఏరువాక పున్నమి సందర్భంగా సీఎం పిలుపు
-








