హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే హైదరాబాద్లో నవనిర్మాణ సభ నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను 11 రోజులు అన్నం తినలేదని ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని అన్నారు. తెలంగాణపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఇక్కడ సభ నిర్వహించే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటే అభ్యంతరం లేదని, కానీ అదే రోజున హైదరాబాద్లో నవనిర్మాణ సభ నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.
తెలంగాణలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని, ఇందులో బీజేపీతో పవన్ కళ్యాణ్కు లోపాయికారీ ఒప్పందం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అలాగే “తెలంగాణ కళ్ల దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని” అన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.








