ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మాట్లాడుతూ, ఇది దేశ చరిత్రలో ఒక కీలక మలుపు కావాలని అన్నారు.
మూడున్నర దశాబ్దాల క్రితమే ఆమోదం పొందాల్సిన ఈ బిల్లు ఇప్పుడు సభ ముందుకు రావడం విశేషమని పేర్కొన్నారు. కాలానుగుణంగా మార్పులు అవసరమని, మహిళలకు అధికారం కల్పించకుండా అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
మహిళలకు అవకాశాలు ఇస్తే వారు దేశానికి కొత్త దిశను చూపుతారని, “వికసిత్ భారత్” లక్ష్యం సాధనలో వారి పాత్ర అత్యంత కీలకమని మోడీ అన్నారు. ఈ బిల్లు చరిత్ర సృష్టించేలా ఉంటుందని, దీనికి వ్యతిరేకంగా నిలిచే వారిని మహిళలు క్షమించరని హెచ్చరించారు.
2024లో విపక్షాలు ఈ బిల్లుకు మద్దతు తెలిపినా, ఇప్పుడు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల అభ్యున్నతికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపిస్తున్నారని, రాజకీయాల్లోనూ వారు ముందుకు రావడానికి ఇది సరైన సమయమని అన్నారు. పంచాయతీ స్థాయిలో రిజర్వేషన్లు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.
గ్రామీణ స్థాయిలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల రాజకీయ అవగాహన కూడా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మహిళల శక్తిని గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించడమే ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశమని మోడీ వివరించారు.








