తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు(Caste Census) సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మొత్త జనాభా వివరాలకే పరిమితమైన సమాచారం, ఇప్పుడు ప్రతి కులానికి సంబంధించిన స్పష్టమైన గణాంకాలతో విడుదల కావడం విశేషంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న నేపథ్యంలో, ఈ గణాంకాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33 శాతం ఉండగా, అందులో వెనుకబడిన ముస్లింలు 10.08 శాతం ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు వెల్లడించింది. అదనంగా ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ అంశాలపై కూడా విశ్లేషణాత్మక సమాచారం అందించింది.
రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల మధ్య వెనుకబాటుతనంలో గణనీయమైన తేడాలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. కొన్ని బీసీ వర్గాలు సామాజిక, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. అలాగే అన్ని వర్గాల్లో కులాంతర వివాహాలు పెరుగుతున్న ధోరణి కూడా కనిపిస్తోంది.
అత్యధిక జనాభా కలిగిన కులాల్లో మాదిగలు 10.3 శాతం తో ముందుండగా, ముదిరాజ్ 7.4 శాతం, లంబాడీ/బంజారా 6.8 శాతం, యాదవ 5.7 శాతం, రెడ్డి 4.8 శాతం, గౌడ 4.6 శాతం, మాల 4.1 శాతం, మున్నూరుకాపు 3.9 శాతం, పద్మశాలి 3.3 శాతం గా నమోదయ్యాయి.
ఈ గణాంకాలను రాష్ట్ర మంత్రులు విడుదల చేయగా, ప్రజలు అధికారిక గణాంకాల వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను పరిశీలించవచ్చని తెలిపారు. ఈ నివేదిక భవిష్యత్ రాజకీయాలు, రిజర్వేషన్లు, మరియు విధాన నిర్ణయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.








