PM Modi: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో హీట్వేవ్ మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వేళ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) ద్వారా ప్రధాని మోడీ స్పందిచారు. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, తరచూ నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పారు. బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలని, మధ్యాహ్న వేళల్లో అవసరం లేకపోతే బయట తిరగకూడదని సూచించారు.
అలాగే ఎండల్లో పనిచేసే కార్మికులు, దారినపోయే వారికి తాగునీరు అందించడం వంటి చిన్న సహాయాలు కూడా ఎంతో మేలు చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని, సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.








