పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం)లో రగులుతున్న యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఏర్పడిన ఆటంకాల వలన ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పందించారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ప్రభుత్వానికి దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టం కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని మంత్రి తెలిపారు. అయితే కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందన్న తరహా వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఆర్థిక హెచ్చరికలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు.
అదే సందర్భంలో ‘3-ఎఫ్’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్) ఫార్ములాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎరువుల ధరలు పెరగడం, బంగారం ధరల్లో ఒడిదొడుకులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. దేశీయంగా ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉందని, భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు.
Nirmala Sitharaman | ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే లక్ష కోట్లు నష్టం… నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
-








