Nepal: భారత మామిడి దిగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని, వాటిపై ఎలాంటి నిషేధం లేదని నేపాల్ అధికారులు స్పష్టం చేశారు. రసాయన అవశేషాల కారణంగా భారత మామిడి దిగుమతులను అడ్డుకున్నారనే ప్రచారం నేపథ్యంలో నేపాల్ వ్యవసాయ శాఖ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవి పూర్తిగా తప్పుదారి పట్టించే సమాచారమని పేర్కొంది.
నిర్దేశిత ఫైటోశానిటరీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే వృక్ష ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే దిగుమతి అనుమతులు, క్లియరెన్స్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
నేపాల్లోని ప్లాంట్ క్వారంటైన్ అండ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. వృక్ష ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించే ఉత్పత్తులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. మరోవైపు, నేపాల్ అమలు చేస్తున్న తాజా నిబంధనలకు అనుగుణంగా హాట్ వాటర్ ట్రీట్మెంట్, ఫైటోశానిటరీ సర్టిఫికెట్లతో ఎగుమతులు జరుగుతున్నాయని భారత వ్యవసాయ శాఖ వెల్లడించింది.
నేపాల్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి ఇప్పటివరకు భారత్ నుంచి 2,005 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఆ దేశానికి చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారత్ ఏటా సుమారు 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తోంది. తాజా ప్రకటనతో ఎగుమతిదారులు, వ్యాపార వర్గాలు ఊరట వ్యక్తం చేస్తున్నాయి.
Nepal | భారత మామిడి ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్.. అపోహలను కొట్టిపారేసిన నేపాల్ ప్రభుత్వం
-








