NEET issue: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో సంస్కరణల అంశాలపై కేంద్ర ప్రభుత్వం, సీజేపీ (CJP) ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కీలక సమావేశం జరిగింది. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ తరఫున కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొనగా, సౌరవ్ దాస్ నేతృత్వంలోని సీజేపీ బృందం తమ అభిప్రాయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా నీట్ వ్యవహారంపై లిఖితపూర్వక వినతిపత్రాన్ని కేంద్రానికి అందజేసింది.
సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు తగిన న్యాయం చేయడంతో పాటు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీజేపీ కోరింది. అలాగే ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని, విద్యార్థులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి తగిన స్థాయిలో చర్చిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది. సమావేశంపై ఇరు పక్షాలు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ALSO READ: Government 50 OTT Apps | డిజిటల్ స్క్రీన్పై కేంద్రం నిఘా.. 50 యాప్లపై వేటు








