Abhijit Dipke: ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా, రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు శాంతియుత మార్గంలోనే ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రభుత్వం అరెస్టుల ద్వారా సమస్యను మరింత పెద్దదిగా చేయొద్దని సూచించారు.
పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ధర్నా కొనసాగుతుందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, 26 రోజుల నిరాహార దీక్ష అనంతరం సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడం సంతోషకరమని దీప్కే అన్నారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డాతో సమావేశం జరగనుందని చెప్పారు. చర్చల వివరాలను అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఉద్యమం ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ వీడియోపై స్పందిస్తూ, యువత భవిష్యత్తుపై నిజమైన చర్యలు తీసుకోవాలంటే విద్యాశాఖ మంత్రిపై నిర్ణయం తీసుకోవాలని అశుతోష్ రంకా డిమాండ్ చేశారు.
ALSO READ: Nadendla Manohar | పార్టీ ఎదుగుదలే లక్ష్యం.. పదవుల కోసం తొందర వద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్








