Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ సేవలను మరింత ఆధునికంగా, ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్లో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు గౌరవప్రదమైన, వేగవంతమైన సేవలు అందించడమేనని స్పష్టం చేశారు. కార్యాలయాల్లో మౌలిక వసతుల లోపం వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలి దశలో భాగంగా 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలను ఒకే నమూనాలో ఆధునిక భవనాలుగా నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం అద్దె భవనాల్లో లేదా శిథిలావస్థలో ఉన్న కార్యాలయాల సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుల పనులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.
మరోవైపు, ఓఆర్ఆర్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత ఆధునిక భవనాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గచ్చిబౌలి, మేడ్చల్, పటాన్చెరు, కోహెడ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వివరించారు. గత ప్రభుత్వం మండలాల పునర్విభజనలో ప్రణాళిక లోపం చూపిందని విమర్శించిన మంత్రి, ప్రస్తుత ప్రభుత్వం కొత్త మండలాలకు అవసరమైన పోస్టులను భర్తీ చేసి పరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.








