Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, ఈ అంశంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, ఎన్నికల నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన విషయాల్లో ముందుగా ఎన్నికల సంఘం మార్గాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సంబంధిత అప్పీల్ ప్రక్రియను అనుసరించాలని న్యాయమూర్తులు సూచించారు.
అంతేకాకుండా, ఇలాంటి కేసుల్లో కోర్టులు గతంలో జోక్యం చేసుకున్న తీర్పులు ఏవైనా ఉంటే వాటిని సమర్పించాలని పిటిషనర్కు సూచించారు. ఈ వివాదం మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సమయంలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఏకైక అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆమె తన నామినేషన్ పత్రాల్లో కొన్ని కీలక సమాచారం వెల్లడించలేదని ఆరోపణలు వచ్చాయి.
భారతీయ జనతా పార్టీ ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ కోర్టులో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసు వివరాలు అలాగే ఆస్తుల వివరాలు సరిగా ప్రకటించలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, వివరణ ఇవ్వాలని జూన్ 9 సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. అయితే నిర్ణీత సమయానికి స్పందన రాకపోవడంతో నిబంధనల ప్రకారం ఆమె నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా అనుకూల తీర్పు రాకపోవడం గమనార్హం.








