Assam: మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్కు చెందిన కాన్వాయ్పై మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇద్దరు జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొందరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం ఉఖ్రుల్ జిల్లా నుంగ్షాంగ్ ఖోంగ్ ప్రాంతం గుండా వెళ్తున్న 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఊహించని విధంగా జరిగిన ఈ దాడికి భద్రతా బలగాలు ప్రతిస్పందించినప్పటికీ, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. దాడి అనంతరం మిలిటెంట్లు అడవుల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దింపిన అధికారులు, దుండగుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతను కాపాడే ప్రభుత్వ సంకల్పాన్ని ఇలాంటి దాడులు దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర హోం మంత్రి గోవిందాస్ కొంథౌజమ్ కూడా నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతామని తెలిపారు.
కాగా, ఉఖ్రుల్ జిల్లాలో కొత్త అస్సాం రైఫిల్స్ అవుట్పోస్ట్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇటీవల స్థానిక నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య తాజా దాడి ఉద్రిక్తతను మరింత పెంచింది. 2023 నుంచి మైతేయ్, కుకీ-జో వర్గాల మధ్య కొనసాగుతున్న జాతి ఘర్షణలతో మణిపూర్ ఇప్పటికే తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయి.








