Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం, రెడీ మిక్స్ లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణం కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉండటం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు ప్రాంతానికి చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రాణాలు కోల్పోయిన వారు కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి గా గుర్తించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు ఆదేశించారు.
ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహాయం అందించాలని సూచించారు.








