AP Census: కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన 16వ జాతీయ జనగణన (Census) ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత జరుగుతున్న ఎనిమిదవ జనగణన ఇదిగా గుర్తింపు పొందింది. దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ గణాంకాలే ప్రధాన ఆధారంగా ఉండనున్నాయి.
ఈసారి జనగణనలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎమ్యూమరేషన్’(self-enumeration) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ విధానం ద్వారా డేటా సేకరణ వేగంగా, ఖచ్చితంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
యాప్ ద్వారా నమోదు చేయడం వల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు తప్పిదాలు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నియమితులైన గణన సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించనున్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనుంది.
ఈ జనగణనలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని అధికారులు సూచించారు. సరైన, పూర్తి వివరాలు అందించడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.








