Godavari River: పోలవరం జిల్లాలోని ఎటపాక మండలంలో విషాదం చోటుచేసుకుంది. గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానిక మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గోదావరిలో విస్తృతంగా గాలింపు చేపట్టగా, కొంతసేపటి తర్వాత ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, నిత్యం మాదిరిగానే చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వీరు ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లారు. నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహంలో చిక్కుకుని బయటపడలేకపోయినట్లు తెలుస్తోంది. మృతులంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.








