Singareni: సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ (టీఆర్ఎస్)తో కలిసి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఆర్కే-7 గనిని సందర్శించిన ఆమెకు సింగరేణి కార్మికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహిళా సూపర్వైజర్లు, అధికారులతో మాట్లాడిన కవిత వారి సమస్యలను తెలుసుకున్నారు. సింగరేణిలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆమె, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గతంలో పార్లమెంట్లో పోరాటం చేశామని గుర్తుచేశారు.
మైనింగ్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన కవిత, కార్మికుల సమస్యలను తెలుసుకోవడం, వారి హక్కుల కోసం పోరాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమావేశాలు నిర్వహించడం కార్మికుల హక్కు అని, వాటిని అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఉచిత విద్య, వైద్యం తమ పార్టీ ప్రధాన ఎజెండాలో భాగమని వెల్లడించిన ఆమె, కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా మంచి పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులకు, కాంట్రాక్టర్ల అవసరాలకు నిధులు వెచ్చించే ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై కూడా దృష్టి సారించాలని కోరారు. హెచ్ఎంఎస్ నాయకత్వంతో కలిసి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్న కవిత, కార్మికులు టీఆర్ఎస్, హెచ్ఎంఎస్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.








