CM Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కుటుంబ అత్యవసర కారణాలతో ముంబై వెళ్లడంతో అధికారిక ప్రక్రియపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ రాజకీయ ఉత్కంఠ మధ్య గురువారం ఉదయం సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలో అల్పాహార సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డీకే శివకుమార్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్యను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పాదనమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమావేశంలో మాట్లాడిన సిద్ధరామయ్య, తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. ఆ పేరు మీ అందరికీ తెలుసు కదా” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న నేతలు నవ్వుల్లో మునిగిపోయారు. కొందరు మంత్రులు డీకే శివకుమార్కు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. ఇక హోంమంత్రి జీ పరమేశ్వర మాట్లాడుతూ, మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
సిద్ధరామయ్యకు సన్నిహితులుగా పేరున్న పలువురు నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు డీకే శివకుమార్ మద్దతుదారులు బెంగళూరులో సంబరాలు ప్రారంభించారు. ఆయన నివాసం సమీపంలో భారీ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్వీట్లు పంచుతూ నినాదాలు చేశారు. దీంతో కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.








