Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, మధ్యప్రదేశ్లో జరిగిన ఈ పరిణామం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.
మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మహిళా నాయకురాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి వివాదాలు లేవని, క్రిమినల్ కేసులు లేదా కోర్టు వ్యవహారాలు కూడా పెండింగ్లో లేవని చెప్పారు. రాజకీయ నిరసనలు, రాస్తారోకోలు లేదా ఇతర వివాదాస్పద ఘటనల్లో కూడా ఆమె పేరు ఎప్పుడూ వినిపించలేదని గుర్తు చేశారు.
అలాంటి క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకురాలి రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక సాధారణ కారణాలు ఉండవని, దీనికి రాజకీయ కోణం ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంతలా వ్యవస్థలను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి, ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.








