Electric Two Wheeler: దేశంలో ఈ-టూవీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పర్యావరణహిత రవాణా పట్ల పెరుగుతున్న ఆసక్తి, ఇంధన ఖర్చుల పెరుగుదల కారణంగా వినియోగదారులు ఈవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) గణాంకాల ప్రకారం FY26లో దేశంలో 14 లక్షలకు పైగా ఈ-టూవీలర్లు అమ్ముడయ్యాయి.
ఇదే సమయంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు సుమారు 1.99 లక్షల వరకు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు 8 లక్షలకు పైగా నమోదయ్యాయి. మొత్తం మార్కెట్లో ఈ-టూవీలర్ల వాటా 6.1 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగినప్పటికీ, పరిశ్రమకు ఆశించిన స్థాయిలో లాభాలు మాత్రం రాలేదు. బెర్న్స్టీన్ నివేదిక ప్రకారం భారత ఈ-టూవీలర్ రంగం వార్షికంగా సుమారు 1.3 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతోంది. అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా ఈ రంగం 300 నుంచి 400 మిలియన్ డాలర్ల వరకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది.
ఈ రంగంలో ఓలా ఎలక్ట్రిక్, అథర్ ఎనర్జీ వంటి స్టార్టప్ కంపెనీలతో పాటు బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయి లాభదాయకత సాధించలేకపోయాయి. లాభాల సమస్యకు ప్రధాన కారణంగా అధిక ఉత్పత్తి ఖర్చులు నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ సెల్స్ మొత్తం వాహన ఖర్చులో సుమారు సగానికి పైగా వాటా కలిగి ఉండటం, వాటిలో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడటం కంపెనీలపై భారం పెంచుతోంది. అలాగే మోటార్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కీలక భాగాల్లో కూడా పూర్తిస్థాయి దేశీయ తయారీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.
అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి పరిమాణం ఇంకా పరిమితంగా ఉండటంతో పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి సదుపాయాలపై పెట్టిన భారీ పెట్టుబడులు తక్కువ యూనిట్లపై విభజించబడుతున్నాయి. దీంతో లాభ మార్జిన్లు తగ్గుతున్నాయి. అయినప్పటికీ కొన్ని కంపెనీలు మెరుగైన పనితీరు చూపుతున్నాయి. ఉదాహరణకు బజాజ్ ఆటోకి చెందిన చేతక్ ఈవీ వ్యాపారం ఎబిట్డా స్థాయిలో నష్టాలు తగ్గించుకుని బ్రేక్-ఈవెన్ దిశగా వెళ్తోంది.
దీర్ఘకాలంలో దేశీయ తయారీ సామర్థ్యాలు పెరగడం, పీఎల్ఐ పథకాలు అమలు కావడం, బ్యాటరీ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ఈ రంగం లాభదాయకత దిశగా వెళ్లే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
Electric Two Wheeler | భారీ అమ్మకాలు ఉన్నా లాభాలు లేవు.. ఈవీ రంగంపై నిపుణుల విశ్లేషణ
-








