GHMC Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నవంబరు నెలలో నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఎన్నికల సంఘం ఈ నెల 15 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానుంది.
తుది ఓటరు జాబితా సిద్ధమైన తర్వాత కార్పొరేటర్ వార్డులు, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను మున్సిపల్ శాఖ పూర్తి చేయనుంది. ఈ ప్రక్రియకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో అక్టోబర్లో జరిగే బతుకమ్మ, దసరా పండుగల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం నవంబర్ మొదటి లేదా రెండో వారంలో పోలింగ్ నిర్వహించే పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా కీలకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆశించిన ఫలితాలు రాకపోయినా, అనంతరం జరిగిన కొన్ని ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సాధించింది. అయితే ఇంకా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నాయకత్వంలో ఉందని తెలుస్తోంది. అందుకే అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.
అలాగే జులై నెల నుంచి స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలను చురుకుగా మార్చి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచే వ్యూహాన్ని అమలు చేసే అవకాశముంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.








