కృష్ణా నదిపై వంద పడవలతో మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మత్స్యకార భరోసా’ పథకం(Matsyakara Bharosa scheme) కింద నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు సుమారు 100 పడవల్లో మత్స్యకారులు కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో ప్రత్యేక సందడి నెలకొంది. పడవలపై వచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా స్వాగతించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మత్స్యకారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రజా ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానానికి మంత్రి లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం తమ సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. “మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ నిరంతరంగా కృషి చేస్తూనే ఉంది.” ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాను. గంగపుత్రులు చూపిన ఈ కృతజ్ఞత, వారి ప్రేమ ఎంతో విలువైనది” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.








