Donald Trump: ఇరాన్తో జరుగుతున్న చర్చలు అనుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో ప్రయోజనకరమైన ఒప్పందం కుదిరే దశకు చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆశించిన ఫలితాలు రాకపోతే పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
తొందరపడి తీసుకునే నిర్ణయాలు శాశ్వత పరిష్కారాలను ఇవ్వవని, అందుకే చర్చలను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నామని ట్రంప్ తెలిపారు. తమ లక్ష్యాన్ని నెమ్మదిగా అయినా ఖచ్చితంగా సాధిస్తామని చెప్పారు. ఇరాన్ నాయకత్వం చర్చల్లో అనుభవం కలిగి ఉన్నప్పటికీ, సైనిక పరంగా ఆ దేశం బలహీన స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.
తన కోడలు లారా ట్రంప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, అవసరమైతే అమెరికా వద్ద అన్ని ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ యంత్రాంగం రంగంలోకి దిగే అవకాశాన్ని కూడా ఆయన సూచించారు.
ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ లెబనాన్లో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన పర్వత ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ బలగాలు ముందుకు సాగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ పర్వత ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక కోట కూడా ఉంది. ఇటీవల సమీప గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించిన ఇజ్రాయెల్ బలగాలు, ఇప్పుడు ఆ కోటను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 1982లో కూడా ఇదే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన విషయం గుర్తు చేస్తున్నారు. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.








