Delhi High Court: నీట్ పరీక్షల నిర్వహణ దృష్ట్యా టెలిగ్రామ్పై కేంద్రం విధించిన తాత్కాలిక ఆంక్షలను ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని స్పష్టం చేస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. జస్టిస్ తేజస్ కారియా ఈ మేరకు తీర్పు వెలువరించారు.
కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక అంశాలను ప్రస్తావించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద చానళ్ల నిర్వహణకు టెలిగ్రామ్ ఒక ప్రధాన వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చానళ్లపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు సంస్థను అప్రమత్తం చేసినప్పటికీ, తగిన చర్యలు చేపట్టడంలో కంపెనీ విఫలమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటు టెలిగ్రామ్ తరఫున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపిస్తూ, మొత్తం యాప్ను నిలిపివేయడం కంటే అభ్యంతరకర కంటెంట్ను మాత్రమే తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నీట్ పరీక్షల నేపథ్యంలో దేశ ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుందనే విషయాన్ని కేంద్రం సమర్థించేలా వివరించలేదని టెలిగ్రామ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం అవసరమైన పరిస్థితుల్లో డిజిటల్ వేదికలను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీంతో టెలిగ్రామ్ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సంస్థ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.








