Commercial LPG cylinder: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.42 మేర పెంచినట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తన అధికారిక వెబ్సైట్లో తాజా ధరలను వెల్లడించింది. కోల్కతాలో ఈ పెంపు మరింత ఎక్కువగా నమోదై రూ.53.50 వరకు చేరింది.
అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశంలో ఎల్పీజీ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో నిర్ణయిస్తుంటాయి.
దీంతో ఇతర గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు కూడా త్వరలో ధరలను సవరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఎల్పీజీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నౌకల రవాణాపై ప్రభావం పడటం వల్ల దిగుమతులపై ఆందోళనలు నెలకొన్నాయి.
భారత్కు అవసరమైన ఎల్పీజీ గ్యాస్లో పెద్ద భాగం ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ మార్గం ద్వారానే దిగుమతి అవుతోంది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సరఫరా అంతరాయాలు ఎదురైనా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అదనంగా 30 రోజుల అవసరాలకు సరిపడే నిల్వలను సిద్ధంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలకు ఆదేశించినట్లు సమాచారం.








