Chittoor: ఏపీ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలం దండపల్లి క్రాస్ సమీపంలో బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై ముందువెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మృ**తులను మోహన్దాస్ (71), నాగరాజారావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందినవారని సమాచారం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కారు వేగంగా ప్రయాణిస్తుండగా ముందున్న లారీని బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనం పూర్తిగా దెబ్బతింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తక్షణ సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం మృ**తదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
గంగవరం సీఐ రామ్భూపాల్ కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.






