Telangana SSC Hall Tickets 2026: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈసారి విద్యార్థులు, తల్లిదండ్రుల సౌలభ్యం కోసం మూడు విధాలుగా హాల్టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.
అధికారిక వెబ్సైట్ Board of Secondary Education Telangana ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, నమోదైన తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు డిజిటల్ కాపీలు పంపనున్నారు. అదే రోజున ముద్రిత హాల్టికెట్లను సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.
వెబ్సైట్ ద్వారా పొందలేని పరిస్థితిలో వాట్సాప్ సేవను వినియోగించుకోవచ్చు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి హాల్టికెట్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు డిజిటల్, ప్రింటెడ్ లేదా వాట్సాప్ కాపీ—ఏ రూపంలో తీసుకువచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు.
ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరుకావాలని, హాల్టికెట్లో వివరాలు సరిచూసుకోవాలని విద్యాశాఖ సూచించింది.






