పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ కొంతకాలంగా అరుదైన డీఎండీ (డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో పోరాడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరంజన్ మృతివార్త తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన నిరంజన్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాప సందేశం వెల్లడించారు. ఇటీవల హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి అతడిని కలిసిన సందర్భాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తనను కలిసిన సమయంలో నిరంజన్ ముఖంలో కనిపించిన చిరునవ్వు, అతడి ఆత్మవిశ్వాసం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.
తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటూనే నిరంజన్ చూపించిన ధైర్యం ఎంతో గొప్పదని పవన్ కళ్యాణ్ అన్నారు. జీవితంపై అతడికి ఉన్న ఆశావాదం, తనపై చూపించిన ప్రేమ తన మనసును తాకాయని తెలిపారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. నిరంజన్ చూపించిన ప్రేమ, చిరునవ్వు, ధైర్యం తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.
Pawan Kalyan | నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. “నీ చిరునవ్వు ఎప్పటికీ గుర్తుంటుంది”
-








