బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్(Bihar Elections) మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో రికార్డు స్థాయిలో “68.79 శాతం ఓటింగ్”నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ వెల్లడించారు.
ఇంకా కొన్ని కేంద్రాల సమాచారం రావాల్సి ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
రెండు దశల్లో కలిపి “66.90 శాతం పోలింగ్” నమోదైందని, ఇది గత ఎన్నికల కంటే “9.6 శాతం అధికం” అని వివరించారు. 1951-52 ఎన్నికల తర్వాత బీహార్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం.
ఈసారి మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించారు — పురుషుల పోలింగ్ 62.8% కాగా, మహిళలది 71.6% గా ఉంది.
20 ఏళ్ల తర్వాత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్
భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పర్యవేక్షణతో నక్సల్ ప్రాంతాల్లో దశాబ్దాల తర్వాత పోలింగ్ జరగడం చరిత్రాత్మకం. గతంలో భద్రతా కారణాలతో పోలింగ్ కేంద్రాలను తరలించేవారు, కానీ ఈసారి ఒక్క బూత్ను కూడా తరలించలేదని అధికారులు తెలిపారు. గయా, జమూయీ జిల్లాల గ్రామాల్లో 20 ఏళ్ల తర్వాత ప్రజలు తమ గ్రామాల్లోనే ఓటు హక్కు వినియోగించారు.
ALSO READ:Turkiye military plane crash:జార్జియాలో విషాదం..కుప్పకూలిన తుర్కియే సైనిక విమానం
దేశంలోనే తొలిసారి 100% వెబ్కాస్టింగ్
రెండో దశలో 122 నియోజకవర్గాల్లో “45,399 పోలింగ్ కేంద్రాలు”ఏర్పాటు చేశారు. ఈసారి దేశంలోనే తొలిసారిగా”100 శాతం వెబ్కాస్టింగ్” చేపట్టారు. ప్రతి బూత్లో సీసీటీవీ కెమెరాలతో లైవ్ పర్యవేక్షణ చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలించే వాహనాలకు “GPS ట్రాకింగ్” వ్యవస్థను వినియోగించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.127 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ స్వాధీనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండో దశలో 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం మీద, ఆధునిక సాంకేతికత వినియోగం, కట్టుదిట్టమైన భద్రతతో రెండో దశ పోలింగ్ విజయవంతంగా ముగిసింది.
