AP Weather Update: ఆంధ్రప్రదేశ్లో వచ్చే 48 గంటల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(State Disaster Management Authority – SDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అదే సమయంలో బిహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించారు.
ఈ వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గురువారం వరకు మేఘావృత వాతావరణం కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని మండలాల్లో వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో ఆదివారం అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్ష సూచనలతో రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులు, మత్స్యకారులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.








