Rain Alert: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వాతావరణ పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి దక్షిణ దిశగా తమిళనాడు మీదుగా మన్నార్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వ్యవస్థ ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, మధ్య ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని సూచించారు. అలాగే రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు.
గత 24 గంటల వర్షపాతం వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో అత్యధికంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా నెమలికల్లులో 25 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.2 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా రత్నగిరి, అనంతపురం జిల్లా హంపాపురం ప్రాంతాల్లో చెరో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Rain Alert | ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. పిడుగులతో కూడిన జల్లులు పడే ఛాన్స్
-








