AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గురువారం ఉదయం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రి పార్థసారధి ఈ నిర్ణయాలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో పరిపాలన ఖర్చులు తగ్గించడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’ అమలు చేయాలని నిర్ణయించారు. ఆ రోజున మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈవీలు లేదా సైకిల్ వినియోగించాలని సూచించారు. అలాగే ఆఫీసులో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఖర్చు తగ్గింపుపై కూడా కేబినెట్ దృష్టి సారించింది. ఎక్కువగా సమావేశాలను వర్చువల్గా నిర్వహించాలని సూచించారు. జిల్లా పర్యటనల్లో కూడా ఖర్చులను నియంత్రించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు.
మంత్రుల విదేశీ పర్యటనలను కొంతకాలం పాటు రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం ఉందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు “నా దేశం నా బాధ్యత” అనే భావనతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఖర్చుల నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.








