K Annamalai: తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అన్నామలై భవిష్యత్తులో తీసుకోబోయే రాజకీయ నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఇవాళ మీడియా ముందుకు వచ్చి తన తదుపరి ముందడుగు ఏమిటో వెల్లడించనున్నట్లు సమాచారం.
దీంతో ఆయన బీజేపీకి పూర్తిగా గుడ్బై చెప్పనున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కే అన్నామలై 2020 ఆగస్టులో ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
“సింగం అన్నామలై”గా గుర్తింపు పొందిన ఆయన, తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతాయి. యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన ఆయన నాయకత్వంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా రాజీనామా ఆమోదం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. అన్నామలై తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన మీడియా సమావేశం తర్వాత ఈ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








