ఏపీలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు కొనసాగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గడువును ప్రకటించింది. తొలుత నిర్ణయించిన గడువు ఈరోజుతో ముగియాల్సి ఉండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ప్రజల వినతులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది.
తాజా నిర్ణయం ప్రకారం, బూత్ లెవల్ అధికారులు (BLOలు) జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించే ప్రక్రియను కొనసాగించనున్నారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, అవసరమైన చోట్ల పునర్వ్యవస్థీకరణ పనులను కూడా ఈ గడువులోపే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు కొత్తగా పేర్లు చేర్చడం, తొలగింపులు, వివరాల సవరణల కోసం క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
సవరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అక్టోబర్ 3, 2026న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఈసీఐ వెల్లడించింది. కొత్త షెడ్యూల్ను జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలకు వెంటనే తెలియజేయాలని ఈసీఐ ఆదేశించింది. అలాగే ప్రతి అర్హుడైన ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించింది. ఇదే సమయంలో తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రస్తుతం నిర్ణయించిన గడువు జూలై 24తో ముగియనుంది.








