CV Shanmugam: తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ రాజకీయ సమీకరణాల్లో మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు బహిర్గతమై పార్టీ చీలిక దిశగా సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అన్నాడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం నేతృత్వంలో పలువురు కీలక నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అనంతరం వారు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సీఎం విజయ్కు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
గత కొన్నేళ్లుగా అన్నాడీఎంకే వరుస ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కొంటోందని, ఈ కారణంగానే పార్టీ భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్నదని షణ్ముగం తెలిపారు. పార్టీ డీఎంకేకు వ్యతిరేకంగా ఏర్పడిందని, 53 ఏళ్ల రాజకీయ ప్రయాణం అదే లక్ష్యంతో కొనసాగిందని ఆయన గుర్తుచేశారు.
అయితే ఇటీవల వచ్చిన రాజకీయ ప్రతిపాదనలు, డీఎంకేతో పొత్తు అంశం పార్టీలో తీవ్ర విభేదాలకు దారి తీసినట్లు ఆయన పేర్కొన్నారు.
పార్టీలో మెజారిటీ సభ్యులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారని, డీఎంకేతో కలిసి వెళ్లితే అన్నాడీఎంకే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎలాంటి కూటమిలో లేమని స్పష్టం చేసిన ఆయన, పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు.
చివరికి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు షణ్ముగం ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి.








