Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు మరోసారి అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. గురువారం జరిగిన పోటీల్లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు చేరాయి. దీంతో మొత్తం పతకాల సంఖ్య 15కు చేరగా, భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పురుషుల 100 మీటర్ల టీ47 పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత అథ్లెట్లు దిలీప్ మహాదు గవిత్, మహమ్మద్ బాసిల్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు.
దిలీప్ 10.71 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని అందుకోగా, బాసిల్ 10.83 సెకన్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకే ఈవెంట్లో ఇద్దరు భారత పారా అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. పురుషుల లాంగ్ జంప్లో స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ మరోసారి రజత పతకం సాధించి కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా రెండోసారి సిల్వర్ గెలిచిన ఘనత సాధించాడు. బాక్సింగ్లోనూ భారత బృందం అద్భుత ప్రదర్శన కొనసాగించింది.
ఇప్పటికే నాలుగు పతకాలు ఖాయం చేసుకున్న భారత బాక్సర్లు, తాజాగా మరో ఆరు పతకాలను నిర్ధారించుకుని మొత్తం 10 పతకాలతో గత కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించారు. అథ్లెటిక్స్లో పురుషుల 200 మీటర్ల స్ప్రింట్లో అనిమేశ్ కుజుర్ సెమీఫైనల్కు అర్హత సాధించగా, షాట్పుట్ విభాగంలో తజిందర్ పాల్ సింగ్ తూర్, సమర్దీప్ సింగ్ గిల్ ఫైనల్కు చేరి మరో పతకంపై ఆశలు రేకెత్తించారు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలతో ఆకట్టుకుంటోంది. అందులో 3 గోల్డ్, 9 సిల్వర్, 3 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. భారత క్రీడాకారుల నిలకడైన ప్రదర్శనతో రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.








