Indian Railways: రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు పశ్చిమ మధ్య రైల్వే (West Central Railway – WCR) ఆగస్టు 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, దళారుల జోక్యాన్ని నియంత్రించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
ప్రస్తుతం టోకెన్ తీసుకున్న ప్రయాణికులు తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అనంతరం మళ్లీ రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త విధానంలో ఈ ఇబ్బంది తొలగి, బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్ పొందే అవకాశం కల్పించనున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 8:30 నుంచి 9:00 గంటల వరకు, నాన్-ఏసీ (స్లీపర్ సహా) తత్కాల్ టికెట్ల బుకింగ్ 9:00 నుంచి 9:30 గంటల వరకు నిర్వహించనున్నారు. దీంతో ప్రయాణికులు ఒకేసారి టికెట్ బుకింగ్ పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.
అంతేకాదు, దళారుల కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి రిజర్వేషన్ కౌంటర్లో గరిష్టంగా ఏసీకి 10 టికెట్లు, నాన్-ఏసీకి 15 టికెట్లు మాత్రమే బుక్ చేసే పరిమితిని అమలు చేయనున్నారు. ఈ మార్పులతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడంతో పాటు, సాధారణ ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు మరింత సులభంగా లభించే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ALSO READ: Pawan Kalyan | తిరుపతిలో గుర్తించిన అరుదైన మొక్కకు పేరు పెట్టిన పవన్ కళ్యాణ్








