El Nino: పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాల తీరు ప్రభావితమవుతోందని, ఈ ప్రభావం ప్రస్తుత రుతుపవనాల సీజన్ ముగిసే వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, వచ్చే వారం రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు స్థానిక వాతావరణ సూచనలను అనుసరించి వ్యవసాయ పనులు ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
ALSO READ: Amaravati | చంద్రబాబు విజన్కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్








