భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని చేరుకోబోతోంది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace) జులై 18న ‘మిషన్ ఆగమన్’ పేరుతో ప్రయోగించనుంది. ఈ ప్రయోగంలో సాంకేతిక విజయంతో పాటు భారత అంతరిక్ష చరిత్రను గుర్తు చేసే ప్రత్యేక పేలోడ్లు కూడా పంపనున్నారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వహస్తాలతో ‘వందేమాతరం'(Vande Mataram) అని రాసిన పోస్టుకార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే స్కైరూట్ బృందం, మాజీ ఇస్రో ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు రాసిన పోస్టుకార్డులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు.
18 క్యారెట్ల బంగారు సూక్ష్మ రాకెట్
అంతరిక్ష రంగ అభివృద్ధికి సేవలందించిన వారికి నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ తెలిపింది. మరో విశేషంగా మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టేవాడ రూపొందించిన 18 క్యారెట్ల బంగారు సూక్ష్మ రాకెట్ కూడా పేలోడ్లో భాగమైంది. దీనిపై సీ.వి. రామన్, విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ చిత్రాలను చెక్కారు. బియ్యం గింజ కంటే చిన్న పరిమాణంలో రూపొందించిన ఈ కళాఖండంతో పాటు కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్వర్క్ను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మిషన్ భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి మరో చారిత్రాత్మక అడుగుగా నిలవనుంది.
Skyroot Aerospace | భారత్ స్పేస్ హిస్టరీలో కొత్త అధ్యాయం.. విక్రమ్-1లో మోడీ సందేశం, ఏమిటి..?
-








