Telangana Bonalu: భాగ్యనగర సంస్కృతి వైభవానికి ప్రతిబింబంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. లంగర్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ(Golconda Jagadambika Mahankali Temple) అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి బంగారు బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారి సన్నిధిలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి కొండా సురేఖకు సంప్రదాయ పద్ధతిలో బోనం ఎత్తడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు.
బోనాల ఉత్సవాల ప్రారంభంతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలు భక్తి శోభతో కళకళలాడాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆషాఢ బోనాల జాతరకు తొలి వేదికగా నిలిచే గోల్కొండలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల వేడుకలు నగరవ్యాప్తంగా ఘనంగా కొనసాగనున్నాయి.








