అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చకుండా తాను జోక్యం చేసుకోవడం వల్లే ఆగిపోయిందని ఆయన మరోసారి ప్రకటించారు. గతంలో పలుమార్లు ఇదే వాదన చేసిన ట్రంప్, తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఎయిర్ ఫోర్స్ వన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్, ‘ఆపరేషన్ సిందూర్’గా పేర్కొన్న నాలుగు రోజుల ఘర్షణలో మొత్తం 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పారు.
అయితే ఆ విమానాలు భారత్కు చెందినవా, పాకిస్తాన్కు చెందినవా అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడంలో తన పాత్ర కీలకమని, ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను నివారించానని కూడా ఆయన పేర్కొన్నారు. అందుకే నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడినని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినట్లుగా, భారత్–పాకిస్తాన్ మధ్య సైనిక చర్యలు నిలిపివేయడంలో ఎలాంటి మూడో దేశం మధ్యవర్తిత్వం చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే కాల్పుల విరమణ నిర్ణయం అమలులోకి వచ్చిందని భారత్ తన అధికారిక వైఖరిని పునరుద్ఘాటిస్తోంది. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్యలు చేపట్టింది. అనంతరం నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తరువాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ పరిణామాల్లో తన పాత్ర కీలకమని ట్రంప్ చెబుతుండగా, భారత్ మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు.








