H-1B visa: అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ (H-1B) వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. వీసా దరఖాస్తుల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, మోసపూరిత విధానాలపై సమగ్ర విచారణ చేపట్టినట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ మాట్లాడుతూ, అమెరికా ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం అమెరికా పౌరులకే ఉండాలన్నారు. కొందరు యజమానులు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్-1బీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చర్యలను ప్రభుత్వం ఇకపై ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.
USCIS ప్రాథమిక పరిశీలనలో కొన్ని సంస్థలు ఒకే అభ్యర్థి పేరుతో పలుమార్లు దరఖాస్తులు సమర్పించి హెచ్-1బీ లాటరీలో ఎంపికయ్యే అవకాశాలను పెంచే ప్రయత్నాలు చేసి గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నకిలీ పత్రాలు, తప్పుడు సమాచారం సమర్పించడం వంటి అంశాలపై కూడా విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ దర్యాప్తులో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన సంస్థలపై భారీ జరిమానాలు, వీసాల రద్దు, భవిష్యత్ దరఖాస్తులపై పరిమితులు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసాపై ఆధారపడుతున్న భారతీయ ఐటీ నిపుణులు తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. నిపుణులు మాత్రం అభ్యర్థులు తమ పత్రాలు, దరఖాస్తుల వివరాలు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.








